భవానీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ.. సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్

  • ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మూడు స్థానాలనూ గెలుచుకున్న టీఎంసీ
  • గవర్నర్ జగదీప్ ధనకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
  • భవానీపూర్ నుంచి 58 వేల ఓట్ల భారీ తేడాతో మమత విజయం
గత నెలలో జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీప్ ధనకర్ స్వయంగా మమతతో ప్రమాణ స్వీకారం చేయించడం గమనార్హం. సాధారణంగా గవర్నర్ ఆదేశాలతో స్పీకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకు భిన్నంగా గవర్నరే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం గమనార్హం. కాగా, మమతతోపాటు మరో ఇద్దరు టీఎంసీ నేతలు అమీరుల్ ఇస్లామ్, జాకీర్ హొసైన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత సమీప బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎమ్మెల్యేగా విజయం సాధించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ ఉప ఎన్నిక నుంచి పోటీకి దిగారు.

గత నెల 30న భవానీపూర్‌తోపాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్, షంషేర్‌గంజ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.  భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ నేత ప్రియాంక టిబ్రేవాలాపై 58 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మిగతా రెండు స్థానాల్లోనూ టీఎంసీ నేతలు విజయం ఘన విజయం సాధించారు.

Mamata Banerjee
Bhabanipur
West Bengal
Oath
TMC

More Telugu News